అందులోభాగంగా రైతులకు సంబంధించి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు చెరుకు రైతులకు 15 రోజుల్లో చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక రైతులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, సాగునీటికి వడ్డీలేని రుణాలతో పాటు బీమా, పింఛన్ సౌకర్యాలు సైతం ప్రకటించారు. బీజేపీని రాష్ట్రం నుంచి తొలగిస్తామని ప్రతిజ్ఞ చేయాలని అఖిలేశ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని, ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని అఖిలేశ్ ప్రకటించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత విడుదల చేసే సమాజ్వాదీ మేనిఫెస్టోలో ఇవన్నీ పొందుపరుస్తామని ఎస్పీ అధినేత పేర్కొన్నారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన అఖిలేశ్ రైతు ఉద్యమ నేతలతో సన్నిహితంగా ఉంటూ వారి మద్దతును కూడగట్టుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కీలక రైతు నేత నరేశ్ తికాయత్ ఎస్పీ కూటమికి మద్దతును ప్రకటించడం ఈ చర్యల్లో భాగమేనని పార్టీ వర్గాలు తెలిపాయి.